సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు


*మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండి అని రేవంత్ రెడ్డి కాళ్లు ప‌ట్టుకొని మొక్కాలా..?


*రేవంత్ రెడ్డి మా అమ్మను ఇష్టమొచ్చినట్లు తిట్టేవాడు


*రేవంత్ రెడ్డి తమ్ముళ్లు తెలంగాణలో మొత్తం భూములు కబ్జా చేస్తున్నారు.



హైద‌రాబాద్ అక్టోబర్ 16 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); : సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండి అని రేవంత్ రెడ్డి కాళ్లు ప‌ట్టుకొని మొక్కాలా..? అని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి మా అమ్మను ఇష్టమొచ్చినట్లు తిట్టేవాడు. ఢిల్లీలో ఖర్గేతో మీటింగ్‌లో మా అమ్మను రేవంత్ రెడ్డి తిడితే ఆరోజు మా అమ్మ ఎంతో ఏడ్చింది అని సుష్మిత తెలిపారు.రేవంత్ రెడ్డి తమ్ముళ్లు తెలంగాణలో మొత్తం భూములు కబ్జా చేస్తున్నారు. మంచిరేవులలో విల్లాలు కట్టుకున్న కొందరు వ్యక్తులు దారి కోసం ఎండోమెంట్ భూమిని అడిగారు.. అది ఇస్తే పక్కన ప్రైవేట్ ల్యాండ్ ఇస్తామని అన్నారు. ఈ ఫైల్ మీద కొండా సురేఖ సంతకం చేస్తే, జపాన్‌లో ఉన్న రేవంత్ రెడ్డి ఆ ఫైల్‌ను ఆపించాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్లు ఆ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారు.. అందుకే మా అమ్మ సంతకం పెట్టిన ఫైల్‌ను రేవంత్ రెడ్డి ఆపేశాడ‌ని సుస్మిత పేర్కొన్నారు.


ఆ ఇద్ద‌రు మంత్రులు, సీఎం త‌ప్ప‌


నిన్న‌టి నుంచి మంత్రి కొండా సురేఖ ఇంటి వ‌ద్ద హైడ్రామా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు కొండా సురేఖ‌తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడ‌లేద‌ని తెలుస్తోంది. ఇక ప‌లువురు మంత్రులు సురేఖ‌కు సంఘీభావం తెలిపిన‌ట్లు స‌మాచారం. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మినహా మిగిలిన మంత్రుల సంఘీభావం తెలిపార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. క్యాబినెట్లో నిన్నటి హైడ్రామాపై చర్చిద్దామని కొండా సురేఖకు కొంద‌రు మంత్రులు హామీ ఇచ్చార‌ని స‌మాచారం.


తాజాగా డిప్యూటీ సీఎంతో కొండా సురేఖ‌, సుష్మిత భేటీ


ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌జా భ‌వ‌న్‌లో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌తో మంత్రి కొండా సురేఖ‌, ఆమె కూతురు సుష్మిత భేటీ అయ్యారు. నిన్న రాత్రి జ‌రిగిన ప‌రిణామాల‌న్నింటిని భ‌ట్టికి సురేఖ వివ‌రించారు. కాసేప‌ట్లో మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ను కొండా సురేఖ క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.