దేశ భద్రత, ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యత


      ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పష్టం చేసిన భారత్‌  


న్యూ డిల్లీ అక్టోబర్ 16 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లపై   అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌   కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని.. ఈ మేరకు ప్రధాని


మోదీ   తనకు హామీ ఇచ్చారని ట్రంప్‌ చెప్పారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్‌   తాజాగా స్పందించింది. దేశ భద్రత, ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ఇంధన దిగుమతుల విషయంలో తమ విధానాలు పూర్తిగా దేశీయ అవసరాల మేరకే ఉంటాయని పేర్కొంది.ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భారత్ భారీ మొత్తంలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో ఒడిదుడుకులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యత. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యం ఆధారంగానే ఉంటాయి. స్థిరమైన ఇంధన ధరలు, సురక్షితమైన సరఫరా.. ఈ రెండే మా ఇంధన విధానంలోని ప్రధాన లక్ష్యాలు. దీనికోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన వనరులను విస్తృతం చేసుకుంటున్నాం’ అని తెలిపారు.ఇక అమెరికా విషయానికొస్తే.. చాలా ఏళ్లుగా ఆ దేశం నుంచి ఇంధన సేకరణను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గత దశాబ్ద కాలంలో ఇది క్రమంగా పెరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం కూడా భారత్‌తో ఇంధన సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఆసక్తి చూపుతోందని తెలిపారు. ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.