శ్రీశైలం ఘటన..... 9 మంది మృతి.....





శ్రీశైలం (ఆయుధం న్యూస్) శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతులను ఏఈ మోహన్‌కుమార్‌, ఏఈ ఉజ్మ ఫాతిమా, ఏఈ సుందర్‌గా గుర్తించారు. సహాయక చర్యల్లో సీఐఎస్‌ఎఫ్‌, ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. దట్టమైన పొగలు అలముకోవడంతో పలువురు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నారు.
జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. తొలుత ప్యానల్‌ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి జలవిద్యుత్‌ కేంద్రం మొత్తం వ్యాపించాయి.
ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్‌ కేంద్రంలో 30 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 15 మంది సొరంగ మార్గం ద్వారా బయటపడగా.. సహాయక సిబ్బంది మరో ఆరుగురిని రక్షించారు. మిగిలిన తొమ్మిది మంది లోపలే చిక్కుకు పోయారు. విద్యుత్‌ కేంద్రంలో చిక్కుకుపోయిన సిబ్బంది ఎలా ఉన్నారోనని వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఉద్యోగుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్‌ శర్మన్‌, ట్రాన్స్‌కో సీఈ రమేశ్‌ తదితరులు సహాయక చర్యలను దగ్గరుడి పర్యవేక్షిస్తున్నారు.