ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు


డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియాంక స్కూటర్‌ టైర్‌ను కావాలనే పంక్చర్‌ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు దుండగులు ఆమెను కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్టు భావిస్తున్నారు. స్కూటర్‌ టైర్‌ పంక్చర్‌ అయిన ప్రాంతం నుంచి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో ప్రియాంక మృతదేహం లభ్యమయింది. సత్యం అనే రైతు ఇచ్చిన సమాచారంతో ప్రియాంక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్కార్ఫ్‌, వినాయకుడి లాకెట్‌ ఆధారంగా హత్యకు గురైంది ప్రియాంక అని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.పురానాఫూల్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.


హంతకులను పట్టుకునేందుకు 10 పోలీస్‌ బృందాలు రంగంలోకి దిగాయి. పంక్చర్‌ దుకాణం వద్ద సీసీటీవీ ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రియాంక కాల్‌డేటాపైనా దృష్టి సారించారు. చివరిసారిగా ఎవరెవరితో ఆమె మాట్లాడింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా పథకం ప్రకారం చేశారా, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టుగా లారీడ్రైవర్లు ప్రమేయం ఉందా అనే దానిపై లోతుగా విచారిస్తున్నారు. ప్రియాంక స్కూటర్‌ టైర్‌ ఎలా పంక్చర్‌ అయింది, టోల్‌గేట్‌ దగ్గర ఆమెతో మాటలు కలిపిందేవరు, సాయం చేస్తామని స్కూటర్‌ను తీసుకెళ్లింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. ( భయమవుతోంది పాప​.. ప్లీజ్‌ మాట్లాడు )
ప్రియాంక హత్యపై పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి...
►విద్యావంతురాలైన ప్రియాంక ముప్పును ముందే పసిగట్టలేకపోయిందా?
►పోలీసులకు ఎందుకు ఫోన్‌ చేయలేదు?
►టోల్‌గేట్‌ వద్దకు వెళ్లకుండా ప్రియాంకను ఆపిందెవరు?
►టోల్‌గేట్‌ వద్ద మాయా మాటలకు లోనయిందా?
►స్కూటర్‌ వదిలిపెట్టి క్యాబ్‌లో ఎందుకు వెళ్లలేదు?
►అసలు ప్రియాంక హత్య ఎక్కడ జరిగింది?
►హత్య వెనుక ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నారా?
►హైవే పెట్రోలింగ్‌ పోలీసులు ఎందుకు పసిగట్టలేకపోయారు?
►పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగిందా?
దర్యాప్తులో పురోగతి
స్కూటర్‌ పార్క్‌ చేసిన ప్రాంతంలోనే ప్రియాంకపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ప్రియాంక లోదుస్తులు, చెప్పులు, మద్యం సీసాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాల కోసం క్లూస్ టీమ్స్‌, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు సోదిస్తున్నారు. లారీ డ్రైవర్లే ఈ ఘాతుకానికి పాల్పడివుంటారని అనుమానిస్తున్నారు. కర్నూల్ హైవే మీదుగా దుండగులు పరారు అయినట్లు భావిస్తున్నారు.