టీసీఎస్‌ లేఆఫ్స్‌ వేళ.. ఇన్ఫోసిస్‌లో 20 వేల ఉద్యోగాలంటూ కీలక ప్రకటన


హైదరాబాద్ జూలై 30 (ఎక్స్ ప్రెస్ న్యూస్);భారత్‌లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌  పెద్ద ఎత్తున లేఆఫ్స్‌   ప్రకటించి ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది కల్లా తన మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం అంటే దాదాపు 12,200 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. టీసీఎస్‌లో ఉద్యోగుల తొలగింపు వేల దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌   తాజాగా కీలక ప్రకటన చేసింది.ఈ ఏడాది సుమారు 20 వేల మంది కాలేజ్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఓ జాతీయ మీడియాతో ఇన్ఫీ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 17 వేల మందికిపైగా ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై కంపెనీ ఎక్కువగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే భారీగా హైరింగ్‌కు సిద్ధమవుతున్నామని సీఈఓ తెలిపారు.‘ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే 17 వేల మందికి పైగా నియమించుకున్నాం. మొత్తం 2025 సంవత్సరానికి 20 వేల మంది కాలేజ్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని భావిస్తున్నాం. కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ మార్పులు, తదితర రంగాల్లో ఇన్ఫోసిస్ ఇప్పటికే పెట్టుబడులు పెట్టింది. ఇప్పటివరకు సంస్థ దాదాపు 2.75 లక్షల మంది ఉద్యోగులకు వివిధ స్థాయిల్లో డిజిటల్, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చింది’ అని సీఈఓ వెల్లడించారు.