దెబ్బకు పరార్‌.. పాక్‌ సైనికుల దుస్తులను బహిరంగంగా ప్రదర్శించిన తాలిబన్లు



న్యూఢిల్లీ అక్టోబర్ 16 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు  పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి తొలిసారిగా భారత్‌లో పర్యటించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ పునరుద్ధరించాయి. అయితే దీనిపై దాయాది పాకిస్థాన్‌   తన అక్కసును వెళ్లగక్కింది. తాలిబన్లు భారత్‌కు దగ్గరవుతుండటంతో ఆగ్రహించిన పాక్‌ పాలకులు తమ సైన్యాన్ని ఉసిగొల్పారు. అఫ్ఘాన్‌లోని   కాందహార్‌ ప్రావిన్సు, పాక్‌లోని బలోచిస్థాన్‌ ప్రాంతం మధ్య ఉన్న కీలక సరిహద్దు జిల్లా స్పిన్‌ బోల్దక్‌లో మంగళవారం అర్ధరాత్రి పాక్‌ సైనికులు దాడులకు పాల్పడ్డారు. దీంతో 15 మంది మరణించగా, 100 మందికిపైగా గాయపడ్డారని అఫ్ఘాన్‌ పాలకులు ప్రకటించారు.దీనికి ప్రతిగా తాలిబన్‌ బలగాలు పాక్‌ సైనికులపై దాడులకు దిగాయి. పాకిస్థాన్‌లోని చమన్‌ జిల్లా, అఫ్ఘాన్‌లోని బోల్దక్‌ జిల్లాలో ఉభయ దేశాలకు చెందిన సైనిక దళాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. మరోవైపు స్పిన్‌ బోల్దక్‌లో తమ సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు పాక్‌ సైన్యం ఉపయోగించిన యుద్ధ ట్యాంకును స్వాధీనం చేసుకున్న తాలిబన్‌ బలగాలు, పాక్‌ సైనిక ఔట్‌పోస్టుపై మెరుపు దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా పాక్‌ సైనికులు పరారైనట్లు, కొంత మందిని బంధించినట్లు, భారీగా ఆయుధాలు, ఆహార పదార్థాలను స్వాదీనం చేసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.తాజాగా ఆ వార్తలు నిజమేనని, తమ దెబ్బకు పాక్‌ సైనికులు పరారయ్యారని తాలిబన్‌ సైన్యం నిరూపించింది. తాము స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఆహార పదార్థాలు, పాక్‌ సైనికుల దుస్తులు, ఇతర సామాగ్రిని అఫ్ఘాన్‌ సైనికులు నంగర్‌హార్ ప్రావిన్స్‌లో బహిరంగంగా ప్రదర్శించారు. పాక్‌ సైనికుల ప్యాంట్లను ప్రదర్శిస్తూ.. ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దృష్యాలను అఫ్ఘానిస్థాన్‌లోని బీబీసీ జర్నలిస్టు దౌద్‌ జున్బిష్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా పాక్‌ సైన్యం విడిచిపెట్టిన అవుట్‌పోస్టుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ప్యాంట్‌లను తాలిబాన్ ప్రదర్శిస్తున్నదని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.