చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు.. ప్రకటించిన ట్రంప్‌

వాషింగ్టన్‌ అక్టోబర్ 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌   అన్నంత పనీ చేశారు. అరుదైన ఖనిజాల ఎగుమతి చైనా   ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన ట్రంప్‌.. అమెరికాలోకి ప్రవేశించే ఆ దేశ వస్తువులపై భారీ సుంకాలు   విధిస్తామని హెచ్చరించారు. తాజాగా చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇవి నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఇప్పటికే చైనా వస్తువులపై 30శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. తాజా టారీఫ్‌లతో అవి 130 శాతానికి పెరిగాయి. అదేవిధంగా క్రిటికల్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇతర దేశాలతో పంచుకోవడంపై నియంత్రణ విధిస్తున్నట్లు వివరించారు.వాణిజ్యంపై చైనా అసాధారణ రీతిలో దూకుడుగా వ్యవహరిస్తుందన్న ట్రంప్‌.. ఆ దేశ ఉత్పత్తులతో పాటు అక్కడి నుంచి దిగుమతయ్యే అన్ని వస్తువులపైనా పెరిగిన సుంకాలు అమలవుతాయన్నారు. ఇది మినహాయింపు లేకుండా అన్ని దేశాలను ప్రభావితం చేయిస్తుందని తన ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. చైనా తీసుకునే తదుపరి చర్యల ఆధారంగా సుంకాలపై అమెరికా నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అమెరికా తయారుచేసే దాదాపు ప్రతి ఉత్పత్తి పైనా భారీగా ఎగుమతి ఆంక్షలు విధించాలని చైనా యోచిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌.. దక్షిణ కొరియా పర్యటనలో జిన్‌పింగ్‌తో సమావేశమవడానికి కారణాలు కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. అమెరికా దిగుమతి చేసుకునే చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచాలని యోచిస్తున్నామని ట్రూత్‌ సోషల్‌ వేదికగా డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. వీటితో పాటు మరిన్ని చర్యలను పరిశీలిస్తున్నామని వెల్లడించిన కొన్ని గంటల్లోనే భారీగా సుంకాలను పెంచడం గమనార్హం.